పార్టీకి గ్లామర్ అద్దిన మమత: సిద్ధమన్న మున్మున్
కోల్కతా: రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుధవారం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మమత 26 మందికి కొత్త వారికి చోటు కల్పించడమే కాకుండా గ్లామర్కు పెద్ద పీట వేసింది. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు బైచుంగ్ భుటియా, ప్రముఖ నటి మున్ మున్ సేన్, సంధ్యారాయ్, ప్రముఖ నటులు దీపక్ అధికారి (దేవ్) తదితరుల పేర్లు అందులో ఉన్నాయి.
సుభాష్ చంద్రబోస్ మనుమరాలు సుగతాబోస్ పేరు కూడా ఉంది. ఇందులో నలుగురు సిట్టింగులకు అవకాశం ఇవ్వలేదు. బుధవారం 42 స్థానాలకు మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. అందులో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడారు. అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలు కలిసి పోయాయని, తెలంగాణ విషయంలో ఆ రెండు పార్టీలు అవగాహనతో వ్యవహరించడమే కలిసిపోయాయని చెప్పేందుకు ఉదాహరణ అన్నారు. విభజించి పాలించే సిద్ధాంతానికి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదన్నారు. విశాళ భారత దేశమే తన ఆకాంక్ష అని, కొత్తగా ఒక జిల్లాను ఏర్పాటు చేయాలన్నా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు.
ఏకపక్ష నిర్ణయాలు వద్దన్నారు. ప్రజలు పాలించేందుకు అధికారమిచ్చారని, ముక్కలు చేసేందుకు కాదన్నారు. తాము ఎన్నికల్లో డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేయలేమని, తమది పేద పార్టీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాదని ఆమె జోస్యం చెప్పారు.
కాగా, మున్ మున్ సేన్ సిపిఎం సీనియర్ నేత బసుదేవ్ ఆచార్య పైన బంకురా నుండి పోటీ చేయననున్నారు. దీనిపై మున్ మున్ సేన్ స్పందిస్తూ.. చాలా కాలంగా బసుదేవ్ బంకురా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.