ఎంఎన్సీ ఉద్యోగి అనుమానాస్పద మృతి: వేర్వేరు గదుల్లో భార్య,తల్లి..
న్యూఢిల్లీ: ఓ ఎమ్మెన్సీ కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. అతను సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ప్లాటినమ్ హైట్స్ అపార్టుమెంటులో గల తన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతుడిని 32 ఏళ్ల అమిత్ బచ్చన్గా గుర్తించారు. అతని తల్లి, భార్య శివానీలు ఇంటిలోని వేర్వేరు గదులలో బంధించబడి కనిపించారు. వారి ఇద్దరికి గాయాలయ్యాయి. అమిత్ బచ్చన్, శివానీలకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది.
మృతుడు మెడ చుట్టూ టీవీ కేబుల్ వైర్ గుర్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం ఏడు గంటల సమయానికి సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. మృతుడి భార్య, తల్లికి గాయాలైనప్పటికీ వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.
వారి స్టేట్మెంటును పోలీసులు రికార్డ్ చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. హత్య లేదా ఆత్మహత్య కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. అమిత్ బచ్చన్ తన తల్లి, భార్యల పైన దాడికి పాల్పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. భార్య, తల్లి వేర్వేరు గదల్లో ఉండటం, అతను మరో గదిలో ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.