లవ్ జిహాద్ ప్రభావం: యువతులకు మొబైల్స్ నిషేధం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లవ్ జిహాద్ నుంచి తమ పిల్లలను కాపాడుకునేందుకు ఆయా వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. లవ్ జిహాద్.. మొబైల్ ఫోన్ల వల్లే ఎక్కువగా జరుగుతోందని భావించిన పలువురు.. బాలికలకు మొబైల్స్ వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో బాలికలు, యువతులకు సెల్ఫోన్లు ఇవ్వరాదని ఆగ్రాకు చెందిన పలువురు వైశ్యులు తీర్మానించారు. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రత్యేకంగా భేటీ అయిన ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కల్రాజ్ మిశ్రా కూడా హాజరైనట్లు సమాచారం.
ఈ భేటీలో బాలికలు, యువతుల రక్షణపై అఖిలేష్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైశ్య ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే రక్షణ కల్పిస్తున్న మిగిలిన వర్గాలను విస్మరిస్తోందని ఆరోపించినట్లు తెలిసింది. ఈ కారణంగానే తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డట్లు సమాచారం.
ఇంటర్మీడియట్ లోపు విద్యనభ్యసించే బాలికలకు ఇకపై సెల్ఫోన్లను ఇవ్వరాదని తీర్మానించినట్లు అఖిల భారతీయ వైశ్య ఏక్తా పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుమంత్ గుప్తా తెలిపారు. మొబైళ్లతోపాటు ఇంటర్నెట్ యువతను నాశనం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సెల్ఫోన్ల వినియోగంపై తమ పిల్లలు అర్థం చేసుకునేలా చెబుతామని తెలిపారు.