మన్మోహన్ చేయలేని పని మోడీ చేశారు: పవార్ ప్రశంస
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనపై ప్రశంసలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్సీపి అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు సైతం మోడీ అమెరికా పర్యటనను ప్రశంసించారు. కాగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ, లోక్సభలో పార్టీ ఉపనాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం ఆయన ఏం సాధించారంటూ విమర్శలు గుప్పించారు.
అయితే నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ను గట్టిగా విమర్శిస్తూ చేసిన ప్రసంగాన్ని ఆనంద్ శర్మ ప్రశంసించటం గమనార్హం. ఇతర ప్రధానులతో పోలిస్తే నరేంద్ర మోడీ మార్కెటింగ్ నైపుణ్యత ఎంతో అధికమని శరద్ పవార్ ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అమెరికాతో మంచి సంబంధాలే ఉన్నా మోడీ స్థాయిలో అమెరికా అధినాయకులను ఆకట్టుకోలేకపోయారని అన్నారు.
మోడీ తన పనిని అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో విదేశీ నాయకుల ముందు ప్రతిపాదిస్తారని అన్నారు. గతంలో ఏ ప్రధానమంత్రికి ఈ నైపుణ్యం లేదని పవార్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. నరేంద్ర మోడీపై శరద్ పవార్ ప్రశంసలు కురిపించటం వలన దీని ప్రభావం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బాగా అనుకూలిస్తుందనే మాట కూడా వినిపిస్తోంది.
పవార్ ప్రశంసల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. మోడీ ముందు వేసుకున్న వ్యూహం ప్రకారమే భారతీయులు అధికంగా ఉన్న న్యూయార్క్లో ఎక్కువ సమయం గడిపారని చెప్పారు. మోడీ తన అమెరికా పర్యటనలో సాధించిన విజయం ద్వారా స్వదేశంలో తన పాపులారిటీని బాగా పెంచుకున్నారని పవార్ అభిప్రాయపడ్డారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఆశించిన విజయం సాధించలేరని ఆయన వ్యాఖ్యానించారు.