చరిత్ర సృష్టించిన భారత్, అమ్మ నిరాశపరచదు: మోడీ
బెంగుళూరు: అంతరిక్ష రంగంలో అగ్ర రాజ్యాల సరసన భారత్ నిలిచింది. అత్యంత క్లిష్టమైన అంగారక గ్రహ యాత్రను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ చేపట్టిన తొలి ప్రయోగంలోనే అంగారకుడి కక్ష్యలోకి భారత్ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా పంపగలిగింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది.
మంగళయాన్ యాత్ర విజయవంతం కావడంతో బెంగళూరు ఇస్రో కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఒకర్నొకరు అభినందించుకున్నారు. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆనందంతో చప్పట్లు చరిచారు. శాస్త్రవేత్తలను అభినందించారు.
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతమైన సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పాఠశాలలో ఐదు నిమిషాల పాటు ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించాలని అన్నారు. వైఫల్యాలకు తొలి బాధ్యత నాది. విజయాలకు బాధ్యత శాస్త్రవేత్తలది అంటూ ధైర్యంగా ముందుకెళ్లండని సూచించారు.
మంచి పనిని మొదలుపెట్టాం.. అంతా మంచే జరుగుతుందని అన్నారు. నష్టభయాన్ని భరించగలిగిన ధైర్యం మనకు కావాలి. అప్పుడే విజయాలను సొంతం చేసుకోగలుగుతామన్నారు. మామ్ అంటే అమ్మ... మనల్ని అమ్మ ఎప్పుడూ నిరాశ పరచదు.
భారత క్రికెట్ క్రీడాకారులు ఓ అంతర్జాతీయ టోర్నమెంట్ను గెలుచుకు వస్తేనే దేశ ప్రజలందరూ సంతోషంతో డ్యాన్సులు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారని... ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయం క్రికెట్ క్రీడాకారులు సాధించిన విజయాల కంటే వెయ్యి రెట్లు గొప్పదని మోడీ అన్నారు. దేశ ప్రజలందరూ ఈ విజయాన్ని తమదిగా భావించాలన్నారు. రేపు నవరాత్రులను జరుపుకోవడంతో పాటు దేశ ప్రజలు మామ్ విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన కోరారు.
అంతరిక్ష పరిశోధనల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్దానంలో నిలిచిందన్నారు. అంగారకగ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా భారత్ నిలించిందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర లిఖించామన్నారు. మనం చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించామని శాస్త్రవేత్తలను ప్రశంసించారు.
హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమా కన్నా మన మామ్ ప్రయోగం బడ్జెట్ తక్కువని మోడీ వ్యాఖ్యానించారు. మన శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలించిందని అన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలు రాబోయే తరానికి స్పూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/jwHBMR8C6B0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ప్రధాని నరేంద్రమోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం ఉదయం ఇస్రోకు చెందిన టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ఇస్టాక్ )కు చేరుకోని ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించారు.
మామ్ విజయం ఒక చరిత్రాత్మకం: ప్రణబ్ ముఖర్జీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) విజయవంతం కావడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. మంగళయాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, యూపీ సీఎం అఖిలేష్, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.