నమోపై అసెంబ్లీలో చర్చ, తెలియదేమోనని సిఎం కౌంటర్
పనాజీ: 'నమో' విషయమై గోవా అసెంబ్లీలో బుధవారం ఆసక్తికరమైన చర్చ సాగింది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరును క్లుప్తంగా నమోగా అందరూ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవా అసెంబ్లీలో చర్చ సాగింది.
కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు అలెక్సో రెజినాల్డో లారెన్సో సభలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నిత్యం నమో జపంతో బిజీగా ఉంటున్నారని, దీంతో గోవాను గుజరాత్లో కలిపేస్తారేమోననే భయం కలుగుతోందని ఎద్దేవా చేశారు. దీనికి పారికర్ ధీటుగా స్పందించారు.
నమో గురించి మీకు తెలియదేమో, నమో అంటే హిందూమతంలో దేవునికి నమస్కారం అని వివరించారు. నమో అంటే సాధారణంగా భగవాన్ కృష్ణునికి నమస్కారం.. కానీ ఈ సందర్భంలో కాంగ్రెసుకు మనం చివరి నమస్కారం చేస్తున్నామని వ్యాఖ్యానించి చురకలు అంటించారు.
సరైన నిర్ణయం తీసుకోండి: మోడీ
ఎన్నికల కమిషన్ 2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడాన్ని మోడీ స్వాగతిస్తూ, సరైన నిర్ణయం తీసుకోవాలని, దేశాభివృద్ధిని వేగవంతం చేయడానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత మోడీ ట్విట్టర్లో ఉంచిన వ్యాఖ్యల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీని ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మమ్మల్ని ఆశీర్వదించమని, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు మెజారిటీ ఇవ్వాలని, దేశ సౌభాగ్యం కోసం 272 ప్లస్ మిషన్ను ఘనమైన వాస్తవంగా చేయాలని ఈ దేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్లో కోరారు. సార్వత్రిక ఎన్నికలను ప్రజాస్వామ్యపు అతి పెద్ద పండుగగా ఆయన అభివర్ణిస్తూ, భారత దేశ భవిష్యత్తుకోసం ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అభివృద్ది చెందిన భారత దేశానికి పునాది వేయడానికి 2014 ఎన్నికలు ఒక గొప్ప అవకాశమని, భారత దేశం భవిష్యత్తుకోసం ఓటు వేయాలని, సరయిన నిర్ణయం తీసుకోవాలని నేను మిమ్మల్నందరినీ కోరుతున్నానని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలను నిర్వహిస్తున్నందుకు మోడీ ఎన్నికల సంఘాన్ని అభినందించడంతో పాటుగా తొలిసారిగా ఓటు హక్కు పొందిన 10కోట్ల కొత్త ఓటర్లను స్వాగతించారు.
పదికోట్ల కొత్త ఓటర్లకు తాను ప్రత్యేక స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. భారత దేశ ప్రజాస్వామిక విలువలను బలోపేతం చేయడంలో, వాటిని కొనసాగించడంలో వారు ముఖ్యమైన పాత్ర పోషించనున్నారన్నారు. ఎన్నికల సంఘాన్ని ఆయన అభినందిస్తూ, ‘అర్హులయిన ఓటర్లందరికీ తాము ఓటరుగా రిజిస్టర్ చేసుకున్నామో లేదో వెరిఫై చేసుకోవడానికి మార్చి 9న చివరి అవకాశం కల్పించినందుకు ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఓటర్లందరూ తప్పక ఉపయోగించుకోవాలి'అన్నారు.