నా పవర్స్ తేల్చండి: గవర్నర్, ఢిల్లీలో భేటీలపై భేటీలు
న్యూఢిల్లీ: పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాల విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్రమే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. లేదంటే ఉద్వేగ స్థితిలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమని ఆయన అన్నట్లు సమాచారం.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్తో ఆయన కీలక మంతనాలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో పరిస్థితులు, హైదరాబాద్లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన అంశాలపై ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన కలుసుకోనున్నారు. ఈ భేటీ తర్వాత పరిస్థితిలో స్పష్టత ఏర్పడొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 5రోజుల పర్యటనకు సింగపూర్ బయలుదేరిన సమయంలోనే గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో రెండు లేదా మూడు రోజులు మకాం వేయనుండటంగమనార్హమని పరిశీలకులు అంటున్నారు. బుధవారం ఢిల్లీ వచ్చిన కొద్ది సేపటికే నరసింహన్ ఉదయం 11 గంటలకు హోం మంత్రిని కలిశారు. అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఇరు రాష్టాల్లో పరిస్థితులు, విభజన సమస్యలపై నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్తో మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఏపీ భవన్కు వచ్చిన దోవల్ నరసింహన్తో కలసి భోజనం చేశారు. వారిద్దరూ ఒకప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో కలసి పనిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్యా సుదీర్ఘ చర్చలు జరిగాయి.
ఆ తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను గవర్నర్ కలిశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు సంబంధించి గవర్నర్కు శాంతి భద్రతలపై ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే అంశంపై స్పష్టత కోసం చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీపై నరసింహన్ తాను కలిసిన పెద్దలకు వివరించారు.