రాజ్నాధ్, మోడీ అంతరం గురించి ఆసక్తికర విషయాలు
హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ల మధ్య ఇటీవల కాలంలో అంతరం ఏర్పడిందంటూ చాలా కథనాలు వచ్చాయి. ఐతే వీరిద్దరి మధ్య అంతరం గురించి టైమ్స్లో ఆదిత్య సిన్హా ఓ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ అనుకుంటున్న రాజ్నాథ్ సింగ్ కన్నా జూనియర్ మంత్రి అయిన కిరెన్ రిజ్జుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో పేర్కొన్నారు. అసోం - నాగాలాండ్ సరిహద్దులో జరిగిన ఘర్షణలపై ప్రధానికి రిజ్జూ నేరుగా రిపోర్టు చేశారని తెలిపారు.
అపాయింట్మెంట్స్ కమిటీ, భద్రత కమిటీలో రాజ్నాథ్ సింగ్ ప్రమేయం నామమాత్రంగా ఉందని అంటున్నారు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోం శాఖలో తనదైన ముద్ర చూపాలని ప్రయత్నిస్తున్నా ఆ అవకాశం రావడం లేదని తన వ్యాసంలో విశ్లేషించారు. దీనికి సంబంధించి గతంలో జరిగిన కొన్ని సంఘటలను తెలియజేశారు.
గతంలో కేంద్రంలో మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య వివిధ అంశాల్లో అభిప్రాయ బేధాలు ఉన్న వారు విడిపోలేదన్నారు. అదే విధంగా అటల్ బీహారీ వాజ్ పేయి, అద్వానీల మధ్య కొన్ని విషయాల్లో తేడా ఉన్నా వారు ఎప్పుడూ విడిపోలేదని సూచించారు.
ఇదే విధంగా నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్ మధ్య అంతరం ఏర్పడినా వాటి ప్రభావం భారతీయ జనతా పార్టీ రాజకీయాలపై ప్రభావం చూపదన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో నోయిడా స్దానం నుండి రాజ్నాథ్ సింగ్ కుమారుడికి పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో రాజ్నాథ్ సింగ్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి.
పార్టీ టిక్కెట్ నిరాకరించడానికి కారణం రాజ్నాథ్ సింగ్ తనయుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, కుటుంబం అవినీతి గురించి మీడియాలో వార్తలు రావడం భావిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.