పివి అంటే అయిష్టం: సోనియాపై మోడీ, పవన్ వచ్చి...
కరీంనగర్: తెలంగాణ ప్రాంతానికి చెందిన దివంగత ప్రధానమంత్రి పివి నర్సింహా రావు పేరు ఎత్తేందుకు కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇష్టపడక పోయే వారని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మంగళవారం మండిపడ్డారు. కరీంనగర్ సభలో మోడీ ప్రసంగించారు.
తెలంగాణను అభివృద్ధి చేయగలిగేదెవరో, అదృష్టాన్ని మార్చగలిగేదవరో ఆలోచించాలన్నారు. తెలంగాణ కోసం పన్నెండువందల మంది బలిదానాలు చేశారని, వీటికి కారణం ఎవరో గుర్తించాలన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను పసిబిడ్డలా చూసుకునే ప్రభుత్వం ఢిల్లీలో రావాలని, అలాంటి బాధ్యతాయుత పార్టీ అయిన బిజెపికి ఎన్నికల్లో మద్దతివ్వాలన్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు పరీక్షలాంటివని, మోసం చేసిన వాళ్ల చేతుల్లోనే తెలంగాణను పెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వకుండా ఇన్నాళ్లు సాగదీసిన పాపం కాంగ్రెస్దే అన్నారు. బిజెపిలాంటి బాధ్యతాయుతమైన పార్టీకి మద్దతివ్వాలన్నారు. కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ చేతిలో పొట్టవద్దన్నారు.
ఎందరో త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెసు పార్టీ తీరు పురుడు పోసి తల్లిని చంపిన విధంగా ఉందని నిప్పులు చెరిగారు. గుజరాత్ అభివృద్ధిని సూరత్ తెలుగు వారిని అడిగితే చెబుతారన్నారు. కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు.
కాంగ్రెసు పార్టీ తెలుగు వారిని అడుగడుగునా అవమానించిందన్నారు. తమకు అధికారం ఇస్తే తెలంగాణ భాగ్యరేఖను మారుస్తామన్నారు. టిడిపి, బిజెపి కూటమికి అధికారం ఇస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాగా, నిజామాబాద్ సభలో తెరాస పైన పవన్ కళ్యాణ్, కాంగ్రెసు పైన మోడీ మండిపడ్డారు.
కాగా, అంతకుముందు నిజామాబాద్ సభలో మోడీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఏర్పడటం, సీమాంధ్రలో ఆందోళన నేపథ్యంలో తాను చింతిస్తున్న సమయంలో... ఒకరోజు తన దగ్గరకు పవన్ వచ్చారని, రాజకీయాలు పక్కన పెట్టి మనసులోని మాట చెబుతున్నానని, ఆయన వ్యాఖ్యలు తనను కదిలించాయన్నారు. పవన్ లాంటి యువకులు ఉన్నంతకాలం తెలుగు స్పూర్తి కొనసాగుతుందన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు ముందుకు సాగుతాయని, తెలుగు సంస్కృతిని కాపాడే సత్తా పవన్లో ఉందన్నారు.