కీలక పరీక్షను ఎదుర్కొనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్
బెంగుళూరు: ఈ నెల 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) సోమవారం కీలక పరీక్షను ఎదుర్కొనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు కీలక పరీక్ష చేయబోతున్నారు. అంగారక గ్రహ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశించనున్న మామ్ లోని కీలక ఇంజిన్ ను పనిచేయించనున్నారు.
440 న్యూటన్ సామర్ధ్యమున్న ఈ ఇంజన్ దాదాపు 300 రోజులుగా వాడకంలో లేదు. ఈ ఇంజిన్ పనిచేయడం మొదలుపెడితే, ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ రెండు రోజుల పాటు ప్రయాణించే మామ్ బుధవారం అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కోసం దీన్ని మరింత ఎక్కువ సేపు మండిచాల్సి వస్తుంది. సోమవారం దీన్ని 3.968 సెనక్ల పాటు మండిస్తారు. ఇందుకోసం 0.567 కిలోల ఇంధనాన్ని ఉపోయోగించుకుంటుంది. ఇప్పటికే మూడు పథ సవరణ విన్యాసాలను దిగ్విజయంగా పూర్తి చేసిన ఇస్రో, నేడు నాలుగో పథ సవరణ విన్యాసానికి సర్వం సిద్ధం చేసింది.
"సోమవారం చేపట్టనున్న నాలుగో పథ సవరణ విన్యాసం పూర్తయితే, బుధవారం మామ్ అంగారక కక్ష్యలోకి దాదాపుగా ప్రవేశించినట్లే. అనుకోని పరిస్థితుల్లో నాలుగో పథ సవరణ విన్యాసం విఫలమైనా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం" అని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందులో ఏమైనా ఇబ్బంది ఏమైనా తలెత్తితే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లు వివరించారు.
మార్స్ ఆర్బిటర్ మిషన్ గత ఏడాది నవంబర్ 5న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నెల్లూరు శ్రీహరి కోట నుంచి విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి బయటకు వెళ్లిపోయింది.
రూ. 450 కోట్లతో చేపట్టిన ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు సక్కెస్ ఐతే నాసా (అమెరికా), ఐరోపా అంతరిక్ష సంస్ద, రోస్ కాస్మోస్ (రష్యా) తర్వాత అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన సంస్దగా ఇస్రో అవతరిస్తుంది.