నిజాలొద్దని, ప్రియాంక సారీ: నట్వర్, సోనియాపై చాప్టర్
న్యూఢిల్లీ: పార్టీలోని నిజాలు బయటపెట్టవద్దని కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి నట్వర్ సింగ్ను ప్రియాంకా గాంధీ కోరారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పార్టీలో నిజాలు బయటపెట్టవద్దని, ప్రియాంక తనను కోరారని, కాంగ్రెసు పార్టీలో అవమానాలకు క్షమాపణ చెబుతున్నట్లు ఆమె తెలిపారట.
సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఓటమికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన వారు బాధ్యులు కాదా అన్నారు.
మరోవైపు, సోనియా విషయంలో రాహుల్ వైఖరి సరైనదేనని నట్వర్ అన్నారు. తండ్రిని, నానమ్మను పోగొట్టుకున్నా.. తల్లిని పోగొట్టుకోలేనని రాహుల్ అన్నారన్నారు. సోనియా విషయంలో రాహుల్ వైఖరి సరైనదే అన్నారు. పార్టీలోకి ప్రియాంక వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.
ఈ ప్రపంచంలోని అతిపెద్ద గొప్ప పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్.. లోకసభలో కేవలం 44 ఎంపీలున్న పార్టీగా దిగజారడానికి కారణం.. సోనియానేనని ‘ముందుమాట'లో నట్వర్ పేర్కొన్నారట. ఈ పుస్తకంలో సోనియా గాంధీకి ఒక పూర్తి అధ్యాయం కేటాయించారు. ‘భయం, మొహమాటం, సిగ్గు ఉన్న మహిళ.. నిరంకుశ అధికారాన్ని సాగించగల నేతగా ఎలా ఎదిగారు?' అనే వివరాలు ఇందులో ఉన్నాయి.
సోనియా తన పట్ల నిర్దయగా వ్యవహరించారంటూ ఆమె విదేశీయతను పరోక్షంగా లేవనెత్తారు. యూపీఏ హయాంలో సిసలైన అధికార కేంద్రం సోనియా నివాసమైన 10-జన్పథ్. పీఎంవోలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న పులోక్ ఛటర్జీద్వారా సోనియా అన్ని రకాల ప్రభుత్వ ఫైళ్లను తెప్పించుకుని పరిశీలించారని నట్వర్ పేర్కొన్నారు.
శంకర్ దయాళ్ శర్మ వద్దనుకున్న తర్వాతే పీవీకి ఆ పదవి లభించిందని నట్వర్ తన పుస్తకంలో తెలిపారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం శంకర్దయాళ్ శర్మను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టాలని సోనియా భావించారు. దీనిపై సోనియా పీఎన్ హక్సర్ సలహా తీసుకున్నారు. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ వద్దకు నట్వర్ తదితరులను పంపించారు. ప్రధాని పదవి స్వీకరించాలని కోరారు.
అయితే, ఆరోగ్య కారణాల రీత్యా తాను ప్రధాని పదవి చేపట్టలేనంటూ సోనియా ప్రతిపాదనను శంకర్దయాళ్ సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాతే ప్రధాని పదవికి సోనియా పీవీని ఎంచుకున్నట్లు నట్వర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత సంభవించిన పరిణామాలతో సోనియా-పీవీ మధ్య దూరం బాగా పెరిగింది.