నాగపట్నం వీధుల్లో దిక్కులేకుండా మాజీ నటి నిషా
చెన్నై: తీవ్రమైన అనారోగ్యంతో దిక్కులేకుండా పడి ఉన్న తమిళ మాజీ నటి నిషాను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించడంతో పాటుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) నాగపట్నం జిల్లా అధికారులను ఆదేశించింది. తీవ్రంగా జబ్బుపడి ఎవరూ చూసే వాళ్లు లేక నాగపట్నం వీధుల్లో పడి ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలతో సహా ఒక మెస్సేజ్ ఎన్హెచ్ఆర్సి సభ్యుడు జస్టిస్ డి మురుగేశన్కు అందింది.
దాంతో తక్షణం ఆమెను అక్కడినుంచి తీసుకుని పోయి చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి, ఎస్పీని ఆదేశించినట్లు ఎన్హెచ్అర్సి ఒక ప్రకటనలో తెలిపింది. ‘తమిళ నటి నిషా పరిస్థితి చూడండి. ఆమె ముస్లిం మహిళ, బాలచంద్రన్, విశు, చంద్రశేఖర్లాంటి వారి దర్శకత్వంలో కమలహాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖ నటుల పక్కనన హీరోయిన్గా ఆమె అనేక తమిళ సినిమాల్లో నటించింది. ఆమె ప్రస్తుతం తీవ్రమైన జబ్బులతో నాగోర్ దర్గా సమీపంలో దిక్కులేకుండా పడి ఉంది. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె శరీరంనిండా చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి' అని ఆ మెస్సేజి పేర్కొంది.
ఒక నిస్సహాయ మహిళ చావు బతుకుల మధ్య దిక్కులేకుండా అందరు జనం చూస్తుండగా పడి ఉండడం, ఎవరు కూడా ఆమెకు సాయపడడానికి లేకపోవడమనే వాస్తవం హృదయాన్ని కలచి వేస్తోందని జస్టిస్ మురుగేశన్ వ్యాఖ్యానించారు. నిషా ప్రస్తుత స్థితి, ఆమెకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని కమిషన్ నాగపట్నం జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించినట్లు ఆ ప్రకటన తెలిపింది,
ప్రస్తుత స్థితిపై, నటి నిషాకు అందిస్తున్న చికిత్సపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ నాగపట్నం జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించింది.