జగన్తో పొత్తు ఉండదు, కఠినంగా ఉంటాం: మోడీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని తమ నమ్మకమైన భాగస్వామిగా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభివర్ణించారు. భవిష్యత్తులోనూ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపరుల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారని, అలాంటి అవినీతి నేతలకు తమ పార్టీలో చోటు లేదన్నారు.
అవినీతి నిర్మూలనపై తమ పార్టీ చిత్తశుద్ధితో కఠినంగా వ్యవహరిస్తుందని, జగన్ కేసులకూ ఇది వర్తిస్తుందన్నారు. కేంద్రంలో రాబోయే తమ ప్రభుత్వం తెలంగాణతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నడుమ సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని మోడీ అన్నారు.
ఆరు దశల ఎన్నికల్లో బీజేపీ గెలుపు విత్తనాలను ప్రజలు నాటారని, రానున్న మూడు దశలు విత్తనాలు మొక్కలుగా ఎదిగేందుకు దోహదపడుతాయని ఆయన ఆరు దశలో పోలింగ్ పూర్తయిన విషయంపై వ్యాఖ్యానించారు. ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కేంద్రలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆన ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో తల్లీకొడుకుల పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఉద్దేశించి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.