కారులో తీసుకెళ్లి అత్యాచారయత్నం: దూకేసిన మహిళ
వివరాల్లోకి వెళితే.. నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన బాధిత మహిళ ఓల్డ్ గుర్గావ్లో నివాసం ఉంటూ..వసంత్ కుంజ్లోని ఓ మాల్లో పని చేస్తోంది. తన విధులు ముగించుకున్న తర్వాత రాత్రి 8.25గంటలకు మహిపల్పూర్ ప్రాంతంలో ప్రభుత్వ వాహనాల కోసం ఎదురుచూస్తోంది.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఓ కారు డ్రైవర్, తన పేరు మనోజ్ యాదవ్ అని చెప్పాడు. తను కూడా గుర్గావ్ మార్గంలోనే వెళుతున్నానని చెప్పి ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏ ప్రయాణికులను కూడా కారులో ఎక్కించుకోకపోవడంపై ఆమెకు అనుమానం వచ్చింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు డ్రైవర్ వేరే మార్గంలో కారును తీసుకెళ్లడాన్ని గమనించిన మహిళ కారును ఆపాలని కోరింది.
అయితే కారును ఆపకుండా మరింత వేగం పెంచాడు డ్రైవర్. ఆ తర్వాత తన పర్స్, మొబైల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతలోనే టోల్ ప్లాజా రావడంతో కారును స్లో చేశాడు డ్రైవర్. ఆ సమయంలోనే బాధిత మహిళ కారు డోర్ తెరిచి బయటికి దూకేసింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న కొందరు ఆమెను కాపాడారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడు అప్పటికే పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.