ఎన్డీయే నుండి బయటకు రాం: ఆశ్చర్యపరిచిన ఉద్దవ్
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య పొత్తు విచ్ఛిన్నం నేపథ్యంలో సేనకు చెందిన కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీని పైన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే మంగళవారం స్పందించారు. ఇప్పుడు తాము కేంద్రం నుండి వైదొలగటం లేదని చెప్పారు.
ప్రస్తుతం తాను ఎన్డీయే ప్రభుత్వం నుండి తప్పుకునే విషయమై ఆలోచించడం లేదని చెప్పారు. ఒకవేళ తాము ఎన్డీయే ప్రభుత్వం నుండి వైదొలిగే పరిస్థితి వస్తే.. మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన ఎంపీలు అందరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు తాము ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేశామని, ఎన్డీయే కూటమి నుండే బీజేపీ, శివసేన ఎంపీలు గెలిచారని ఆయన అన్నారు. కాబట్టి తాము ఎన్డీయే నుండి వైదొలగాలనుకుంటే ఇరుపార్టీల ఎంపీలు రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు.
కాగా, ఉద్ధవ్ థాకరే సోమవారం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ భారత్ తిరిగి వచ్చాక కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేసే అవకాశముందని వ్యాఖ్యానించారు. అయితే, మంగళవారం మాత్రం రాజీనామా చేయరని చెప్పడం గమనార్హం. ఉద్దవ్ థాకరే ప్రకటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.