ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుష్వంత్ సింగ్ గురువారం ఉదయం కన్నుమూశారు. 99 ఏళ్ల కుష్వంత్ సింగ్ వృద్ధాప్యంతో తన తండ్రి శోభా సింగ్ నిర్మించిన సుజన్ సింగ్ పార్క్లోని సొంత అపార్ట్మెంట్లో కన్ను మూశారు. ఆయన చాలా సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్నారు. దేశ విభజన, సిక్కుల చరిత్ర, సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు.
కుష్వంత్ సింగ్ పంజాబ్లో స్వర్ణ దేవాలయంనుంచి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జర్నేల్ సింగ్ భిందర్వాలేను తన రచనలతో నేరుగా ఢీకొన్నప్పటికీ 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వానికి దూరమయ్యారు ఆపరేషన్ బ్లూస్టార్కు నిరసనగా ఆయన తనకు ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్' పురస్కారాన్ని వాపసు చేసారు. తర్వాత ప్రభుత్వం 2007లో ఆయనకు ‘పద్మవిభూషణ్' అవార్డును ప్రకటించింది.
తన తండ్రి చాలా ప్రశాంతంగా చివరి శ్వాస విడిచారని, చివరిదాకా ఆయన పూర్తి తెలివిగానే ఉన్నారని కుష్వంత్ కుమారుడు, జర్నలిస్టు రాహుల్ సింగ్ చెప్పారు. కొన్ని వారాల క్రితమే ఆయన రచనలు చేయడం నిలిపేసినప్పటికీ పుస్తకాలు, వార్తాపత్రికలు చదివే వారు. ఈరోజు ఉదయం ఒక పుస్తకం చదివారని, క్రాస్వర్డ్ పజిల్ పూర్తి చేసారని, తర్వాత కొద్ది నిమిషాలకే కన్నుమూశారని రాహుల్ సింగ్ చెప్పారు.
1816 ఫిబ్రవరి 2న ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్లోని హదాలీలో జన్మించిన కుష్వంత్ సింగ్ ప్రభుత్వ పత్రిక ‘యోజన'కు వ్యవస్థాపక సంపాదకుడిగా పని చేసారు. తర్వాత ఆయన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్ పత్రికలకు కూడా చాలా సంవత్సరాలు సంపాదకుడిగా పని చేశారు. రాష్టప్రతి ప్రణబ్, ప్రధాని మన్మోహన్, సోనియా సహా పలువురు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.