పెటాకి బక్రీద్ చేదు: శాకాహారం తినాలన్నందుకు దాడి
భోపాల్: పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) కార్యకర్తలకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో... బక్రీద్ సందర్భంగా ముస్లింలు శాకాహారం స్వీకరించాలని, జంతువధ చేయరాదని పలువురు పెటా కార్యకర్తలు ప్రచారం చేశారు. ఆగ్రహించిన స్థానికులు వారిపై దాడి చేశారు.
ఉద్యమకారిణి బెనజీర్ సురయ్యా నేతృత్వంలో కొందరు వలంటీర్లు నగరంలోని తాజ్-ఉల్-మసీద్ వద్ద ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. సురయ్యా పచ్చని ఆకులను కలిగి ఉన్న చున్నీ ధరించి శాకాహారం ప్రాధాన్యతను చాటే ప్రయత్నం చేశారు. పెటా ప్రచారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్ళిపోవాలని ప్రతి నినాదాలు చేశారు.
అయినా సురయ్యా బృందం వెనక్కితగ్గకపోవడంతో వారు దాడికి దిగారు. అనంతరం, నగర పోలీస్ కమిషనర్ సునీల్ పాటిహార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. సురయ్యాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిపై స్థానికుడు నవీద్ ఖాన్ మాట్లాడుతూ... పెటా కార్యకర్తలు తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారని, తమ మతంపై నేరుగా దాడి చేసే యత్నం చేశారన్నారు.