నా రోల్ మోడల్: బాబుపై కేంద్రమంత్రి, పెద్దిరెడ్డి ఝలక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఆకాశానికెత్తారు! చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు తనకు రోల్ మోడల్ అన్నారు. ఆయన నుండి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఐటీ ద్వారా విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు సలహాలు ఇచ్చారని తెలిపారు.
బ్యాంకుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సమర్థుడు, ఆదర్శప్రాయుడన్నారు. ప్రతిపాదించిన 50 రోజుల్లోనే ప్రాజెక్టులను ఓకే చేయించుకున్నారన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ 27వేల మెగావాట్ల విద్యుత్ సాధిస్తుందని చెప్పారు.
కేంద్రం ఇచ్చిందని పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వేరుగా అన్నారు.
హైదరాబాదులో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసినందుకు పరిహారంగా కేంద్రం 24 గంటల విద్యుత్ను నజరానాగా ఇస్తోందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అర్హులకు పింఛన్లు అందజేయడం లేదన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ చేయకుండానే తమ ప్రభుత్వం అంత చేసింది, ఇంత చేసింది అని చెప్పుకోవడం సరికాదన్నారు.