వేడి నీటితో సరిపెట్టిన మోడీ: ప్లీజ్ తినండని ఒబామాతో..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ఇచ్చిన విందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనకు వైట్హౌజ్ ఘనస్వాగతం పలికింది. అయితే ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ అధ్యక్షుడి విందులో కేవలం వేడి నీటిని మాత్రమే తీసుకున్నారు.
తను ఉపవాసంలో ఉన్నానని చెప్పిన మోడీ.. దయచేసి మీరు డిన్నర్ చేయండని ఒబామాను, ఇతర మంత్రులు, ప్రతినిధులను కోరారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రోటోకాల్ ప్రకారం విందు సందర్భంగా మోడీ ముందు ఓ ప్లేటు పెట్టారు. అయితే మోడీ మాత్రం ఓ గ్లాసులోని వేడి నీటిని సేవించారు. ప్రతీ ఏడాది నవరాత్రుల సందర్భంగా ఎంతో కఠినంగా ఉపవాసం చేసే మోడీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. అందువల్లే ఆయన ఆహారం ఏమి తీసుకోకుండా నీటిని మాత్రమే తాగారు. ప్రస్తుతం ఆయన ఉపవాసం ఆరు రోజులకు చేరుకుంది.
ఆ విందులో మాంసాహారంతోపాటు శాకాహారన్ని కూడా ఏర్పాటు చేశారు. చేపలు, క్యారెస్ సాస్, అవకాడలు, మేక జున్ను, రోటీ క్రిస్ప్, లాంటి చాలా రకాల వంటకాలను అక్కడ ఉంచారు. మాంసాహారం సేవించేవారి కోసం కాలిఫోర్నియా వైట్ వైన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు.