స్వచ్ఛ భారత్: వాల్మీకి బస్తీలో రోడ్డు ఊడ్చిన మోడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ద్య కార్మికులతో కలిసి మోడీ రోడ్డు పూడ్చి చెత్త ఎత్తారు. పలువురు అధికారులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకు ముందు బస్తీలోని వాల్మీకి మందిర్ను మోడీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. గాంధీ కలలు గన్న డ్రీమ్ ఇండియా ఇంకా సాకారం కాలేదని ఆయన అన్నారు.
వాల్మీకి బస్తీని సందర్శించిన తర్వాత మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అధికారిక వేదిక మీదికి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, నితినీ గడ్కరీలతో పాటు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ లోగో కేవలం లోగో కాదని, మనం భారత్ను శుభ్రం చేస్తున్నప్పుడు గాంధీజీ మనల్ని చూస్తున్నాడని ఆయన అన్నారు. మజీదు, మందిర్, గురుద్వారా ఏదైనా కావచ్చు మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు.
అతి తక్కువ ధరతో మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నప్పుడు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోలేమా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైందని, జాతి పట్ల మన ప్రేమకు అది గుర్తు అని ఆయన అన్నారు. ఇది 1.2 బిలియన్ మంది ప్రజల కార్యక్రమమని, ఈ విషయాన్ని 1.2 బిలియన్ సార్లు చెపుతానని, ఇది ప్రభుత్వం, మంత్రులు మాత్రమే చేయలేరని ఆయన అన్నారు.
సోషల్ మీడియా ప్రచారాన్ని తాము ప్రారంభించామని, 9 మందిని శుభ్రం చేస్తున్న ఫొటోలను పోస్టు చేయాలని ఆహ్వానించానని, మరో 9 మందిని ఆహ్వానిస్తానని ఆయన అన్నారు. శుభ్రం చేసే పని కేవలం కార్మికులది మాత్రమే కాదని, పౌరులకు బాధ్యత లేదా అని ఆయన అన్నారు.
తాను బాగా రామ్దేవ్, సల్మాన్ ఖాన్, శశి థరూర్, ప్రియాంక చోప్రా, భారత రత్న సచిన్ టెండూల్కర్, కమల్ హాసన్లను ఆహ్వానించానని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు.