‘చల్తాహై’ ధోరణి మానండి: మోడీ, అగ్ర రాజ్యంగా..
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) చేపట్టిన అనేక ప్రాజెక్టులు గడువుకన్నా వెనకబడి ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘చల్తాహై' (అలసత్వ ధోరణి) ధోరణి మానుకోవాలంటూ గట్టి హెచ్చరిక చేశారు. అంతేగాక కాకుండా భారతదేశాన్ని ప్రపంచంలో ఇతర దేశాలకన్నా ముందుంచేందుకు ప్రాజెక్టులను గడువుకన్నా ముందే పూర్తి చేయాలని సంస్థకు సూచించారు. బుధవారం ఇక్కడ డిఆర్డిఓ అవార్డుల ప్రదానోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోడీ పాల్గొని ప్రసంగించారు.
రక్షణ రంగంలో టెక్నాలజీ శరవేగంగా మారిపోతోందన్న ఆయన ఈ విషయంలో భారతదేశం వెనకబడి ఉందని, ఎందుకంటే మనం ఒక సిస్టమ్ను పూర్తి చేయడానికి ముందే దానికన్నా రెండడుగులు ముందుండే ప్రాడక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తోందని అన్నారు. ‘దేశంలో టాలెంట్ కొరత ఉండడం దీనికి కారణం కాదు, బహుశా ‘చల్తాహై' వైఖరి (అలసత్వ ధోరణి) దీనికి కారణమని నేను అనుకుంటున్నాను' అని మోడీ చెప్పారు. అంతేకాదు, పరిస్థితికి తగిన విధంగా స్పందించి, ప్రపంచానికి అజెండాను నిర్ణయించాలో లేదో నిర్ణయించుకోవాలని ప్రధాని డిఆర్డిఓ శాస్తవ్రేత్తలతో అన్నారు.
ఇతర దేశాలు చూపిన మార్గంలో నడవడం ద్వారా కాకుండా వారికి దారి చూపించడం ద్వారా మాత్రమే మనం ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలవగలుగుతామని అన్నారు. ‘ప్రపంచం మనకోసం ఆగదు.. కాలంతో పోటీపడి మనం పరుగుపెట్టాలి. అందువల్ల మనం ఏ పని చేసినా గడువుకన్నా ముందు చేయడం కోసం కష్టపడి పని చేయాలి. 1992లో చేపట్టిన ఒక ప్రాజెక్టు 2014లో కూడా పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని మనం చెప్పే పరిస్థితి ఉండకూడదు. ప్రపంచం మనకన్నా ముందు ఉంటుంది' అని మోడీ అన్నారు.