నటి ఫిర్యాదు: సదానంద కొడుక్కి నోటీసు, అరెస్ట్ దాకా..
బెంగళూరు: నటి, మోడల్ మైత్రేయ ఫిర్యాదు నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును జాయింట్ పోలీసు కమిషనర్ ఎస్ రవి పర్యవేక్షిస్తున్నారు. ఆయన శనివారం మాట్లాడారు.
తాము కార్తీక్ గౌడకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించామన్నారు. శనివారం సాయంత్రం వరకు కార్తీక్ గౌడ విచారణ అధికారి ముందు హాజరు కాలేదన్నారు. కేసును తాము సరైన విధానంలో విచారిస్తున్నామని, ఇంకా అరెస్టు అంశం వరకు వెళ్లలేదన్నారు.
కాగా, ఫిర్యాదు చేసిన మైత్రేయ స్టేట్మెంటును పోలీసులు తీసుకున్న విషయం తెలిసిందే. మైత్రేయ 8వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. మరోవైపు, కార్తీక్ గౌడ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. దీని పైన విచారణ 3వ తేదీకి వాయిదా పడింది.