విభజన: చర్చకి రాని 'భార్యాభర్తలు', హక్కులేదని కవిత
న్యూఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశమై ఐఏఎస్, ఐపీఎస్ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాల పైన చర్చించింది. ఈ భేటీలో భార్యాభర్తలైన అధికారుల అంశం చర్చకు రాలేదు. మరోసారి డీవోపీటీతో కమిటీ సమావేశం అయ్యే అవకాశముంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల సీఎస్లు హాజరయ్యారు. కాగా, ముసాయిదాలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఐఏఎస్, ఐపీఎస్ల పంపిణీపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన 50 మంది అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. మరో సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గత నెల 22న ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఐఎఏస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై అభ్యంతరాలను ఈ భేటీలో చర్చించారు. గతంలోనే అధికారుల విభజన పూర్తి అయింది. వాటిలో అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక జాబితా ఖరారు అయ్యాక తుది నివేదికను ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం కోసం పంపనున్నారు.
హక్కుండదని కవిత
ఉద్యోగుల విభజన పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేఖతో తాము ప్రధాని మోడీని కలుస్తామని తెరాస ఎంపీ కవిత అన్నారు. రోజువారి వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఉండదని కేంద్రం చెప్పిందని కవిత అన్నారు. హైదరాబాద్ కామన్ కేపిటలేనని, జాయింట్ కేపిటల్ కాదన్నారు. హైదరాబాదులోని ప్రభుత్వం రంగ ఆస్తుల పైన ఆంధ్రాకు హక్కులుండవన్నారు.