పిఎస్ఎల్వీ సి24 విజయవంతం, గవర్నర్ అభినందనలు
శ్రీహరికోట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వీ-సి24 శుక్రవారం విజయవంతమైంది. నిర్దిష్ట సమయానికి రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఈ ప్రయోగంతో భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్-1బిని పిఎస్ఎల్వీ వాహక నౌక అంతరిక్షంలోకి తీసుకు వెళ్లింది.
ఈ ఉపగ్రహంతో కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. పిఎస్ఎల్పీవి సి24 నిర్దేషిత సమయానికే నింగిలోకి దూసుకు వెళ్లింది. సమాచార వ్యవస్త అభివృద్ధికి ఇది తోడ్పడనుంది. ఉపరితలం, సముద్రతలంలో నేవిగేషన్కు సాయపడే ఉపగ్రహాలు ఉన్నాయి. విపత్తు నిర్వహణ, వెహికూలర్ ట్రాఫిక్ పరిశీలన తదితర అంశాల్లో ఉపయోగపడనుంది.
ఈ ప్రయోగంతో భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్)-1బిని' పిఎస్ఎల్వీ వాహక నౌక అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహంతో భారతీయ నేవిగేషన్ వ్యవస్థ అత్యంత యాక్యురసీ లెవెల్కు వెళుతుంది.
ఇది భారత రక్షణ రంగానికి ఎన్నో సేవలు అందించనుంది. శత్రువుల కదలికలతో పాటు విమాన, నౌకల కదలికలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఈ ఉపగ్రహం పసిగడుతుంది. నేవిగేషన్ సిస్టంకు సంబంధించి ఈ సిరీస్లో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఇది సిరీస్లో రెండో ఉపగ్రహం. ఈ ప్రయోగం విజయవంతంతో అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరప్ల సరసన భారత్ నిలుస్తుంది. కాగా, ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు.