టార్గెట్ '19, అసెంబ్లీ: పవన్ టు రజనీ ఎవరూ చేజారొద్దు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో 80 లోకసభ స్థానాలకు గాను 73 స్థానాల్లో గెలుపొందేలా వ్యూహరచన చేసిన ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇప్పుడు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, జమ్ము కాశ్మీర్ తదితర రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. బీజేపీకి ఉత్తరాదిన పట్టు ఉంది. దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు, అప్పుడే 2019 లోకసభ ఎన్నికలు టార్గెట్గా బీజేపీ వెళ్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల పైన అమిత్ షా పావులు కదుపుతున్నారంటున్నారు.
మహారాష్ట్రంలో శివసేన, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ ముందుకు వెళ్తోంది. తెలంగాణలోను టీడీపీతో కలిసి వెళ్తోంది. అయితే, స్థానిక బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటించనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లే విషయమై స్పష్టత రానుంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, టీలలో బీజేపీ తరఫున జోరుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
నరేంద్ర మోడీ, అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో కలిసి వెళ్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే విజయకాంత్తో దోస్తీ కట్టారు. అయితే, పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగా రజనీకాంత్కు గాలం వేస్తున్నారు. కర్నాటకలో బలం పెంచుకునేందుకు బయటకు వెళ్లగొట్టిన యెడ్యూరప్ప వంటి వారిని తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు అశేష అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మద్దతును బీజేపీ తీసుకుంది. ఆయనతో జోరుగా ప్రచారం చేయించింది. అంతేకాదు, గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోవద్దని వాదిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. జనసేనతో మాత్రం కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అండ ఉంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోను బీజేపీకి బలమే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కమలం 'చే'జారవద్దని కమలం నేతలు భావిస్తున్నారు. జనసేన మద్దతు అలాగే కొనసాగడం లేదా పవన్ తమ పార్టీని విలీనం చేయడం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
రజనీకాంత్
తమిళనాడులో 2016లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా పార్టీని అక్కడ బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా అవసరమైన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తన రాజకీయ ఆరంగేట్రం పట్ల ఎప్పుడు మౌనం వహించే రజనీకాంత్ను తమ పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో మోడీ తమిళనాట ప్రచారానికి వెళ్లినప్పుడు రజనీకాంత్ ఇంటికి స్వయంగా వెళ్లి కలిశారు. ఇప్పుడు అమిత్ షా ఆ సూపర్ స్టార్కు ఫోన్ చేసి.. పార్టీలో చేరాలని, 2016 సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారట.
యడ్యూరప్ప
దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక్క కర్నాటకలోనే. యడ్యూరప్ప, గాలి జనార్ధన్ రెడ్డిలు ఆ పార్టీకి నాడు ముఖ్య నేతలు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ ఇద్దరికి పార్టీ షాకిచ్చింది. అయితే, బీజేపీ పరిస్థితి కూడా కర్నాటకలో దారుణంగా పడిపోయింది. దీంతో యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకుంది. పాత 'ముఖ్య' నేతల బలంతో తిరిగి కన్నడ నాట వికసించాలని భావిస్తోంది.
అవసరమైతే ఆయన జనసేనను బీజేపీలో కలిపేసుకునే ప్రయత్నాలు కూడా గతంలో చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నించేందుకు జనసేన పెట్టానని ప్రకటించారు. ఆయన బీజేపీతో కలిసి పని చేస్తారు తప్పితే.. విలీనం ప్రసక్తి లేదన్నారు. ఇదిలా ఉండగా.. తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రం. అయితే, అక్కడ తమ బలం పుంజుకోవడానికి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్కు ఎప్పటి నుండి బీజేపీ గాలం వేస్తోంది.
తాజాగా రజనీకాంత్కు అమిత్ షా ఫోన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రజనీ బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ.. అమిత్ షాకు అప్పగించారంటున్నారు. 2016 శాసనసభ ఎన్నికల్లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మోడీ వ్యూహరచన చేశారని, రజనీకాంత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగాలని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.