కెసిఆర్తో మాట్లాడ్తా: టీవీ చానెళ్ల బ్యాన్పై రాజ్నాథ్
న్యూఢిల్లీ: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్లను బెదిరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో మాట్లాడతానని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వందరోజుల పాలనలో తమ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించారంటూ వారిని అభినందించారు.
మీడియాపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు రాజ్నాథ్ సింగ్ ఆ విషయం చెప్పారు. మీడియా ప్రశ్నలకు ఆయన ప్రతిస్పందించారు. తనను కలిసినప్పుడు కేసీఆర్తో ఈ అంశంపై చర్చించానని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
‘మీరు ఆయనతో మాట్లాడిన తర్వాతే మీడియాను బెదిరిస్తూ తీవ్రస్థాయిలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు కదా?' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దీనిపై కేసీఆర్తో మరోసారి మాట్లాడతానన్నారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేపై పలు విమర్శలు వచ్చాయని, దానిపై కేంద్రం స్పందన ఏమిటని ప్రశ్నించగా..గణాంకాల కోసం సర్వే చేసి ఉండవచ్చునని అన్నారు.
మీడియాపై వరంగల్ సభలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. కెసిఆర్ తీరుపై కొన్ని జాతీయ మీడియా సంస్థలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి.