ఐదు నిమిషాలు చాలు: జయలలిత తరఫున జెత్మలానీ
హైకోర్టులోని 8వ నెంబర్ హాలులో బుధవారం ఉదయం 11 గంటలకు కోర్టు వెకేషనల్ సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ రత్నకళ జయ బెయిల్ పిటిషన్ను విచారణ చేపట్టారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోవడాన్ని గమనించిన జస్టిస్ రత్నకళ అభ్యంతరం వ్యక్తం చేశారు. అపరాధి ఎంత ప్రభావశాలి అయినా, ఎంత తీవ్ర పరిణామం ఎదురైనా ప్రతివాదుల తరఫున ప్రాతినిధ్యం లేకుండా విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతివాదుల కోసం ఎదురుచూడడం కుదరదంటూ జయ బెయిల్ పిటిషన్ను స్వీకరించేందుకు జస్టిస్ రత్నకళ నిరాకరించారు.
లోపాలు సరిదిద్దిన తర్వాత పిటిషన్పై విచారణ చేపడతామని పేర్కొం టూ విచారణను అక్టోబర్ 6 వతేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆసమయంలో జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెత్మలానీ ముందుకు వచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్పై విచారణ జరపవచ్చునని వాదించారు. అయితే ఈ వాదనను జస్టిస్ రత్నకళ అంగీకరించలేదు.
మరోసారి రాంజెఠ్మలాని న్యాయమూర్తికి తన వాదన వినిపించారు. ఈ కేసు వాదించేందుకు తాను ప్రత్యేకంగా లండన్నుంచి వచ్చానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహారంపై పరిశీలన జరిపేందుకు ఐదు నిముషాల సమయం ఇవ్వాలని జెఠ్మలానీ విజ్ఞప్తి చేశారు. తనకు ఐదు నిముషాల సమయమిస్తే జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని జెత్మలానీ వాదించారు. అయితే ప్రతివాది లేకుండా కేసు ఎలా వాదిస్తారంటూ జస్టిస్ చంద్రకళ జెత్మలానీని ప్రశ్నించారు. దీంతో ఏకీభవించని రాం జెత్మలానీ పదేళ్ల శిక్ష పడితేనే ప్రతివాది అవసరమని, తమ క్లయింటుకు నాలుగేళ్ల శిక్ష మాత్రమే పడిందని వివరించారు. 30 నిముషాలపాటు జయ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తితో వాదనకు దిగారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీసింగ్ మాట్లాడుతూ ప్రత్యేక కోర్టులో మాత్రమే తాను ప్రాసిక్యూటర్గా ఉన్నానని, ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోసం జయలలిత హైకోర్టుకు అప్పీల్ చేశారని, హైకోర్టులో ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహించేందుకు సంబంధించి తనకు అధికారిక సమాచారం లేదని చెప్పారు. భవానీసింగ్ వాదనను విన్న అనంతరం జస్టిస్ రత్నకళ.. ప్రతివాది లేకుండా ముందుకు సాగడం సాధ్యం కాదని, జయ బెయిల్ పిటిషన్తోపాటు శశికళ, నటరాజన్, వీ.ఎన్.సుధాకరన్, ఇళవరసిలు కూడా బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను కలిపి ఒకేసారి విచారణ జరుపుతానంటూ కోర్టు కార్యకలాపాలను వాయిదా వేశారు.
ఈ సమయంలో కేసు మరో మలుపు తిరిగింది. జస్టిస్ రత్నకళతో మాట్లాడిన జెత్మలానీ బృందం తన వాదనలను మరోసారి వినిపించింది. ప్రాసిక్యూటర్ లేకపోవడం తమ సమస్యకాదని, అటువంటి కారణంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేయడం సరికాదని న్యాయమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. ఇదే అంశాన్ని హైకోర్టు రిజిస్ట్రార్కు కూడా వివరించారు. దీంతో జయ బెయిల్ పిటిషన్ను బుధవారం ఉదయం విచారణకు చేపట్టనున్నట్లు జస్టిస్ చంద్రకళ ప్రకటించారు.