నరేంద్ర మోడీతో రామోజీరావు, బాబుపై అంబటి ఆగ్రహం
న్యూఢిల్లీ/హైదరాబాద్/గుంటూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు మంగళవారం భేటీ అయ్యారు. రామోజీ రావుతో పాటు ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఈ భేటీలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామోజీ రావు ప్రధానికి ఆధ్యాత్మిక నగరం 'ఓం' దార్శనిక పుస్తకాన్ని ఇచ్చారు.
ఆ తర్వాత కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్, శ్రీపాద యశోనాయక్ తదితరులతో రామోజీ రావు భేటీ అయ్యారు.
ఏపీ ఇంఛార్జ్ రూఢీ, తెలంగాణకు కృష్ణదాస్
భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించింది. ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిగా రాజీవ్ ప్రతాప్ రూఢిని, తెలంగాణ రాష్ట్రానికి పీకే కృష్ణదాస్ను నియమించింది. కర్ణాటక బీజేపీ ఇంఛార్జిగా తెలుగు వాడైన మురళీధర్ రావును నియమించింది.
బాబు, కేశినేనిపై అంబటి ఆగ్రహం
ప్రజలను మోసం చేయాలనే తప్ప వారికి సేవ చేద్దామనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం గుంటూరులో ధ్వజమెత్తారు. రైతు సాధికార సంస్థకు కేటాయించిన రూ.5వేల కోట్లు ఏ మూలకు సరిపోవన్నారు.
రూ.87 వేల కోట్లు అప్పులుంటే అందులో నాలుగో వంతు వడ్డీ కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల రైతులు భఈమా సౌకర్యం కోల్పోయారన్నారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయడం లేదన్నారు. నారా వారు నరాసురుడా లేక నరకాసురుడా అని ప్రశ్నించారు.
కడుపుమండిన రైతులు, స్త్రీ శక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు మరీ పెట్రేగిపోతున్నాయన్నారు. విజయవాడ లోకసభ సభ్యుడు కేశినేని నాని స్థలాలు ఆక్రమిస్తే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నకలీ వ్యక్తులతో ఇంటర్ పరీక్షలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు టీడీపీ అరాచకాలను గమనిస్తున్నారన్నారు.