ప్రతీకారం: రేప్ నిందితుడి సోదరిని ఎత్తుకెళ్లి గ్యాంగ్రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యువతులు, అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. ప్రతీకారం నెపంతో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. తమ తరపు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడి కుటుంబంపై ప్రతీకారం పెంచుకున్న ఐదుగురు దుండగులు.. ఆ కుటుంబానికి చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో చోటు చేసుకుంది.
అత్యాచార బాధితురాలి సోదరుడు ఆగస్టు 25న నిందితులకు బంధువైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురురచూస్తున్న వారికి(నిందితులకు).. బాధిత యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలియడంతో ఆమెను ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.
కాగా, తీవ్ర భయాందోళనకు గురైన బాధిత యువతి సమీపంలోని కుమ్హేడ్ బ్రిడ్జ్పై నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. అక్కడికి చేరుకున్న యువతిని గమనించిన స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను తన ఇంటివద్ద చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు కక్రౌలి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఐదుగురు నిందితులలో ఓ నిందితుడ్ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.