ఇందిరా గాంధీ హంతకులపై సినిమా విడుదలకు బ్రేక్
తాము ఈ చిత్రాన్ని చూశామని, రేపు ఈ సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించామని హోంమంత్రిత్వ శాఖ సిపార్సులపై సినిమాను సమీక్షించిన తర్వాత సిబిఎఫ్సి చైర్పర్సన్ లీలా శామ్సన్ గురువారంనాడు చెప్పారు. సినిమా ప్రదర్శన కారణంగా తలెత్తబోయే శాంతిభద్రతల పరిస్థితి, హోం మంత్రిత్వ శాఖ నివేదిక ఆధారంగా హోం మంత్రిత్వ శాఖ, సిబిఎఫ్సి, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆమె చెప్పారు.
సినిమాలోని అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హోం శాఖ ఈ సినిమా వల్ల పంజాబ్, ఉత్తర భారతంలోని ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యానికి విఘాతం కలగవచ్చన్న భయాలను సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు పంపిన ఓ ఉత్తర్వులో వ్యక్తం చేసింది. ఇందిరాగాంధీ హంతకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్, కేహర్ సింగ్ జీవితాల ఆధారంగా తీసిన ఈ సినిమాలో వారి చర్యను గొప్పదిగా చిత్రీకరించారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా అవినీతి ఆరోపణలపై ఇటీవల అరెస్టు చేసిన సెన్సార్ బోర్డు సిఈఓ రాకేశ్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుని ఈ సినిమాకు క్లియరెన్సు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.