చంద్రబాబుపై మోడీ ఆగ్రహం: అలా అయితేనే వేదిక
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపి పొత్తు విషయంలో మరో ముసలం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ గాలివాటాన్ని అందుకుని సీమాంధ్రలో గట్టెక్కాలని చూస్తున్న చంద్రబాబు తీరు నరేంద్ర మోడీకి నచ్చడం లేదని అంటున్నారు.
సీమాంధ్రలో బిజెపితో పొత్తు ఉండదని ప్రకటించి, సంచలనం సృష్టించి చివరకు బిజెపి నాయకత్వానికి చంద్రబాబు తలొగ్గారు. ఒక్క ఇచ్చాపురం శాసనసభ సీటును బిజెపి నుంచి వెనక్కి తీసుకుని చల్లబడ్డారు. పొత్తు ఉంటుందని చెప్పిన చంద్రబాబు బిజెపికి కేటాయించిన మూడు స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించారు.
సంతనూతలపాడు, కైకలూరు, కడప శాసనసభా స్థానాల్లో చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులను కూడా పోటీకి దించారు. దీనిపై నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకుంటారని బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ సోమవారం చెప్పారు. అదే సమయంలో నరేంద్ర మోడీతో ఈ నెల 22వ తేదీన చంద్రబాబు వేదికను పంచుకుంటారని కూడా చెప్పారు.
అయితే, ప్రకాష్ జవదేకర్ చంద్రబాబుకు మోడీ అభిమతాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం మోడీతో వేదికను పంచుకోవడానికి వీలవుతుందని ఆయన చంద్రబాబుకు చెప్పారని అంటున్నారు. చంద్రబాబు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మోడీ ఆయనతో వేదికను పంచుకోవడానికి నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు.