చనిపోయినట్లుగా నమ్మించాడు, యువతితో బెంగళూర్లో
న్యూఢిల్లీ: మూడు నెలల క్రితం మృతి చెందినట్లుగా భావిస్తున్న చంద్రమోహన్ శర్మ అనే ఆర్టీఐ కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు బతికి వచ్చాడు! అతను.. తాను చనిపోయినట్లుగా పోలీసులను నమ్మించి, తప్పించుకు తిరుగుతున్నాడు. అతనిని గ్రేటర్ నోయిడా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.
మే 2న జరిగిన కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడని, సామాజిక సమస్యల పైన గళమెత్తినందుకే కక్షగట్టి ప్రత్యర్థులు అతనిని అంతమొందించారని చంద్రమోహన్ శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రమోహన్ శర్మ మరణించినట్లు చెబుతున్న రోజు నుండే పొరుగున ఉండే ఓ యువతి కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. కేసును చేధించారు. కనిపించకుండా పోయిన యువతి ఫోన్ నెంబరును ట్రేస్ చేయగా ఆమె బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందింది.
అక్కడకు పోలీసులు వెళ్లి యువతితో పాటు చంద్రమోహన్ శర్మను చూశారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్న కారులో మరో వ్యక్తి మృతదేహం పెట్టారని గుర్తించారు. ఇతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.