సాక్షి: బాబు దీక్ష భగ్నానికి సచిన్ రిటైర్మెంట్కు లంకె
న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు న్యాయం పేరుతో న్యూఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష భగ్నానికి బుధవారం, గురువారం ప్రయత్నించినప్పటికీ ఓ రోజు ప్రత్యేక రైళ్లు, మరో రోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ ప్రకటన ఉండటంతో వాయిదా పడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో వచ్చింది.
చంద్రబాబు మధుమేహ వ్యాధుగ్రస్తుడైన నేపథ్యంలో దీక్ష ప్రారంభించిన రెండు రోజులకే ఆయనను ఆసుపత్రికి తరలిస్తారని అందరూ భావించారని అయితే తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు హైదరాబాదు నుండి ఢిల్లీ వచ్చే వరకు బాబును కదిలించవద్దని పార్టీ నేతలు కోరడంతో పోలీసులు అందుకు అనుమతించారని సాక్షిలో వచ్చింది. దీంతో బుధవారం దీక్ష భగ్నం వాయిదా పడిందని అభిప్రాయపడింది.
ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం చంద్రబాబును ఆసుపత్రికి తరలించాలని అనుకున్నప్పటికీ మధ్యాహ్నానికి సీన్ మారిందని పేర్కొంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ ప్రకటించారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో ప్రచారం కోసం చంద్రబాబు దీక్ష భగ్నం గురువారం కూడా వాయిదా పడిందని అభిప్రాయపడింది. ఈ సమయంలో బాబు దీక్ష భగ్నం చేసినా మైలేజి రాదని పార్టీ నేతలకు చెప్పడంతో వారు పోలీసులతో మాట్లాడి దీక్ష భగ్నాన్ని శుక్రవారానికి వాయిదా వేయించారని రాసింది.
కాగా, చంద్రబాబు దీక్ష శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఉదయం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో దీక్షా ప్రాంగణంలో టెంట్లు తడిసిపోయాయి. బాబు దీక్షను ఈ రోజు భగ్నం చేసే అవకాశాలున్నాయంటున్నారు.