సంజయ్ బారును ఉతికి ఆరేసిన ప్రధాని కూతురు
న్యూఢిల్లీ: సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకంపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూతురు తీవ్రంగా ధ్వజమెత్తారు. అది వెన్నుపోటు పొడవమేనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని విశ్వాసాన్ని సంజయ్ బారు ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. సంజయ్ బారు అనైతికమని ఆమె అన్నారు.
పుకార్లను ఒక్క దగ్గర చేర్చి సంజయ్ బారు పుస్తకం రాశారని మన్మోహన్ సింగ్ కూతురు ఉపిందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర పాఠాలు చెబుతారు. తన తండ్రి చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలను సంజయ్ బారు కనీసం ధ్రువీకరించుకోలేదని, వాటిని వాస్తవాలుగా చిత్రీకరించారని ఆమె అన్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ బారు పుస్తకం రాసిన సందర్భాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. అది ఆబ్జెక్టివ్గా లేదని ఆమె అన్నారు. సంజయ్ బారు ఎప్పుడు కూడా విధాన నిర్ణయంలో భాగం కారని ఆమె అన్నారు. తనను తాను గొప్పగా చిత్రీకరించుకోవడానికి మాత్రమే సంజయ్ బారు ఆ పుస్తకం రాశారని ఆమె అన్నారు.
తాను ప్రధాని తరఫున మాట్లాడడడం లేదని ఆమె అన్నారు. సంజయ్ బారు అతిగా చేసి మాట్లాడిన విధానం తనకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించిందని ఆమె అన్నారు. పుస్తకం ఎన్నికల తర్వాత వస్తుందని సంజయ్ బారు చెప్పారని ఆమె అన్నారు.
పుస్తకాన్ని ఏ సందర్భంలో ప్రచురించాలనే విషయంలో రచయిత పాత్ర కూడా ఉంటుందని ఆమె అన్నారు. పుస్తకాన్ని తేవడంలో రాజకీయ ఉద్దేశం లేదని చెప్పడం పూర్తిగా అబద్ధమని ఆమె అన్నారు. ఎన్నికలు జరుగుతున్న వేళ సంజయ్ బారు ఆ పుస్తకాన్ని ఉద్దేశ్యవూర్వకంగానే తెచ్చారని ఆమె అన్నారు.