ఎపి వాదన విన్నాకే: ఎంసెట్ కౌన్సెలింగ్పై సుప్రీం
న్యూఢిల్లీ: ఎంసెట్ కౌన్సెలింగ్పై పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 21కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ వాదన విన్న తర్వాతనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ నిర్వహణకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున ముఖుల్ రోతఖీ వాదించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందువల్ల అక్కడ యాజమాన్య నిర్వహణ, సిబ్బంది విభజన జరగలేదని, అంతేకాకుండా ఫీజు రియింబర్స్మెంట్ విషయమై లెక్కలు తేలాల్సి ఉందని చెబుతూ అక్టోబర్ 31 వరకు సమయం ఇవ్వాలని న్యాయవాది కోర్టును కోరారు.
అయితే గతంలో ఇటువంటి సంప్రదాయం లేనందువల్ల ఇప్పుడు కొత్తగా ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని, ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించినందున కౌన్సెలింగ్ కూడా ఉమ్మడిగా ఎందుకు నిర్వహించరాదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది.
దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయం కూడా తెలుసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాలేజీలను ఎంపిక చేసుకునే విధానం ఉందా? లేదా? అనే విషయం కూడా చెప్పాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ తన అభిప్రాయం చెప్సాలని లేఖ రాస్తూ, సోమవారం లోగా అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.