షీలాదీక్షిత్ యూ టర్న్, గిఫ్ట్.. మంత్రిపై ప్రధాని ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను అనలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ శనివారం అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి షీలా దీక్షిత్ మద్దతు పలికినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై షీలా వివరణ ఇచ్చారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను చెప్పలేదన్నారు. తగిన సంఖ్యాబలం ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే చెప్పానని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు మంచివని, ఎందుకంటే అవి ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో బీజేపీ ఉంటే, అది ఢిల్లీకి మంచిదే అని ఆమె అప్పుడు అభిప్రాయపడ్డారు. వాటిపై దుమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు.
మంత్రిపై మోడీ మండిపాటు
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరుడి పైన మండిపడ్డారు. పాత్రికేయులకు బహుమతులు ఇచ్చారన్న కారణంగా ఆయన పైన మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆ మంత్రి ఇచ్చే వివరణను కూడా ఆయన తిరస్కరించారు. ఆ మంత్రి తన శాఖ పైన వార్తలు రాసిన విలేకరులకు బహుమతులు ఇచ్చారని తెలిసిన ప్రధాని ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆయన పైన ఆఘ్రహం వ్యక్తం చేశారు. అవి మన విధానాలకు విరుద్ధమని చెప్పారు.