ఆ టెక్కీ భార్యని పొడిచి, ఉరేసుకున్నాడు: నటించానని చెప్పిన శివానీ
ఢిల్లీ: ఓ ఎమ్మెన్సీ కంపెనీలో పని చేసే సీనియర్ టెక్కీ ఒకరు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆయన తల్లీ, భార్యలు కూడా వేర్వేరు గదుల్లో కత్తిపోట్లకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
అయితే, మృతి చెందిన టెక్కీ తన భార్యను కత్తితో పొడిచి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుడి పేరు అమిత్ బచ్చన్. ఆయన భార్య శివాని పత్ని. ఈ సంఘటనకు ముందు ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు చెప్పారు.
వివాహం విషయమై వారి మధ్య గొడవ జరిగినట్లుగా గాయాలతో బయటపడిన భార్య తన స్టేట్మెంట్లో చెప్పారు. తమ కంట్రోల్ రూంకు శివాని పత్ని ఫోన్ చేసి, గాయాలైనట్లు తెలిపిందని పోలీసులు చెప్పారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి శివానిపత్నికి గాయాలై, ఆమెకు బ్లీడింగ్ అవుతోందని, తనకు గాయాలైనట్లు సెక్యూరిటీ గార్డును అప్రమత్తం చేసేందుకు ఎనిమిదో అంతస్తు నుండి ఫ్లవర్ పాట్ను కిందకు పడేసిందని చెప్పారు.
అప్పటికే భర్త అమిత్ బచ్చన్ ఫ్లోర్లో మృతి చెంది ఉన్నాడని, అతని మెడకు కేబుల్ వైర్ ఉందని చెప్పారు. అతను బరువుగా ఉండటం వల్ల ఆయన మృతదేహం కిందకు పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, సీలింగ్ ఫ్యాన్కు ఎలాంటి డామేజ్ కాలేదని చెప్పారు. తాము వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.
తన భర్త తనను కత్తితో పొడిచిన తర్వాత తాను చనిపోయినట్లుగా నటించినట్లు భార్య శివాని పత్ని పోలీసులకు చెప్పింది. తను కిందపడిపోయిన తర్వాత అతను గది నుండి బయటకు వెళ్లిపోయాక తాను లోపలి నుండి డోర్ లాక్ చేసుకున్నట్లు తెలిపింది.
ఈ సంఘటన జరిగినప్పుడు అమిత్ బచ్చన్ తల్లి చంద్రకాంత కూడా ఇంట్లోనే ఉన్నారు. తనను తన కొడుకు గదిలో బందించి, తన మొబైల్ ఫోన్ లాక్కెళ్లాడని ఆమె తెలిపారు. అయితే, అమిత్ బచ్చన్ సోదరి త్రిష తన సోదరుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శివానిపత్ని దీని వెనుక ఉండవచ్చునని ఆరోపిస్తున్నారు.
కాగా, సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ప్లాటినమ్ హైట్స్ అపార్టుమెంటులో గల తన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో 32 ఏళ్ల అమిత్ బచ్చన్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని తల్లి, భార్య శివానీలు ఇంటిలోని వేర్వేరు గదులలో బంధించబడి కనిపించారు. వారి ఇద్దరికి గాయాలయ్యాయి.
అమిత్ బచ్చన్, శివానీలకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. మృతుడు మెడ చుట్టూ టీవీ కేబుల్ వైర్ గుర్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం ఏడు గంటల సమయానికి సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. మృతుడి భార్య, తల్లికి గాయాలైనప్పటికీ వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.