ప్రజలే చెప్తారు: మోడీ 100 రోజుల పాలనపై సోనియా
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకోనున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ధ్వజమెత్తారు. దేశంలో ధరలు పెరిగిపోవడానికి, మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఈ వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయా లేదా అనే దానిపై ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ, ఆ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్, తాగునీటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.
సోమవారం ఈ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ నెలకొన్న సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చారని, ముఖ్యంగా విద్యుత్, తాగునీటి సరఫరా సరిగాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారని, వీరి దుస్థితిని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఫరీద్పూర్ గ్రామంలో సోనియా అన్నారు.
హర్చంద్పూర్, బకులిహా బ్లాకుల్లో నిర్మించిన వివాహ మందిరాలతో పాటు ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం (పిఎంజిఎస్వై) కింద నిర్మించిన రహదారులను సోనియా ఈ సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు.
మరోపక్క మతతత్వ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నా మోడీ సర్కారు మౌనమే సమాధానం అన్నట్లు వ్యవహరిస్తోందని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. అలాగే మరో నాయకుడు మనీష్ తివారీ కూడా ఈ వంద రోజుల్లో మోడీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. మాటాలకు-చేతలకు ఎంతమాత్రం పొంతన లేనివిధంగా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు.