ఓటు వేయని మీరా: సోనియా, రాహుల్, కేజ్రి ఓటు
న్యూఢిల్లీ: గురువారం న్యూఢిల్లీలో జరిగిన లోకసభ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకులు అజయ్ మాకెన్, అరవింద్ సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్లతోపాటు ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు వేసిన అనంతరం చిరునవ్వుతో బయటికి వచ్చి ఇంక్ పడిన తన వేలును మీడియాకు చూపారు.
ఓటు వేసిన అనంతరం అరవింద్ కేజ్రివాల్ మీడియాతో మాట్లాడుతూ.. న్యూఢిల్లోని ఏడు లోకసభ స్థానాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని, మరో ఐదేళ్లు యూపిఏకే అవకాశం ఇస్తారని చెప్పారు.
కాగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఢిల్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వరుణ్ గాంధీ, మీనాక్షి లేఖి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హర్ష వర్ధన్, ఆప్ నాయకుడు మనోజ్ సిసోడియా రాఖీ బిర్లా, కిరణ్ బేడీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వచ్చి ఢిల్లీలో ఓటు వేశారు.
ఓటు వేయలేకపోయిన మీరా కుమార్
లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఆమెకు ఢిల్లీలో ఓటు హక్కు ఉండగా గురువారం ఢిల్లీలోని లోకసభ స్థానాలతోపాటు బీహార్లోని ససారం లోకసభ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
ససారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో మీరాకుమార్ ఢిల్లీకి వెళ్లలేకపోయారని ఆమె వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ససారం ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అక్కడే ఉండి ఆమె ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని వారు చెప్పారు. ససారం నుంచి 2004, 2009 ఎన్నికల్లో మీరా కుమార్ గెలుపొందారు.