దారుణం: వ్యక్తికి నిప్పంటించి మంత్రగత్తెల చిందులు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కొడుకు ముందే ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన మంత్రగత్తెలు, అతనికి నిప్పంటించి హత్య చేశారు. అతడు మంటల్లో కాలుతుంటే అతని చుట్టూ చేరి చిందులు వేశారు. ఏడుగురు నిందితుల్లో నలుగురు మంత్రగత్తెలు ఉన్నారు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. తన కొడుకుకు అనారోగ్యం చేయడంతో దిండోరికి చెందిన బ్రిజ్లాల్ అనే వ్యక్తి పార్వతి అనే మంత్రగత్తెను ఆశ్రయించాడు. అయితే బ్రిజ్లాల్ ఒక మాంత్రికుడని చెప్పిన మంత్రగత్తె పార్వతి.. అతడ్ని చంపేయాలని శిశ్యులను ఆదేశించింది. దీంతో నలుగురు మంత్రాలు నేర్చుకుంటున్న మహిళలతోపాటు ఇద్దరు పురుషులు పదునైన ఆయుధాలతో బ్రిజ్లాల్పై దాడి చేశారు.
అతడు తీవ్ర గాయాలతో కిందపడటంతో అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అతడు అరుపులు చేయడంతో అతడిపై మరిన్ని దుస్తులు వేసి కాల్చారు. అతడు మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తుంటూ.. అతని చుట్టూ తిరుగుతూ మంత్రగత్తెలు చిందులు వేశారు. అతడు బూడిదగా మిగిలే వరకూ వారు తమ చిందులను కొనసాగించారు.
ఈ దారుణాన్ని ఆపాలని బ్రిజ్లాల్ భార్యా, కొడుకు కేకలు వేశారు. మంత్రగత్తెల ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉండటంతో వారి అరుపులకు ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితుడి భార్యా, కొడుకును హెచ్చరించి పంపించేశారు. ఒక్క రోజు రాత్రి మొత్తం ప్రయాణం చేసిన బాధితుడు భార్యా, కొడుకు నివాస్ ప్రాంతానికి చేరుకుని, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. మంత్రగత్తె పార్వతి, భగవతి, కుసియా, సుర్తియా, ముకేష్, డుమరి సింగ్, గెండ్ సింగ్లపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన త్రిశూలం, గొడ్డలి, ఆశ్రమంలోని హర్మోనియం, డ్రమ్, ఇతర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.