వారణాసిలో ప్రచారం: అరవింద్ కేజ్రివాల్పై రాళ్ల దాడి
వారణాసి: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయనపై దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రివాల్ గురువారం రాత్రి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంలోనే అక్కడికి చేరుకున్న కొందరు యువకులు రాళ్లు, ఇటుక ముక్కలు ఆయనపై విసిరారు.
అరవింద్ కేజ్రివాల్ వారణాసిలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి ప్రశ్నలు, సూచనలు ఆయన స్వీకరించారు. ప్రచారాన్ని కొనసాగిస్తూ.. లంక వద్ద కేశవ్ పాన్ సమీపంలోకి రాగానే రాత్రి 8గంటల ప్రాంతంలో కొందరు యువకులు కేజ్రివాల్పై దాడికి దిగారు.
అంతేగాక ‘హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ' అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ఘటన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమీపంలో జరిగింది. దాడి చేసిన అనుమానుతులలో ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కేశవ్ పాన్ షాప్ యజమాని కేశవ్ చౌరాసియా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నామినేషన్ వేసేందుకు ప్రతిపాదించిన వారిలో ఒకరు కావడం గమనార్హం. బాగా ప్రాచూర్యం పొందిన అస్సిలోని టీ స్టాల్ యజమాని పప్పు కూడా మోడీని ప్రతిపాదించిన వ్యక్తులలో ఉన్నారు. పప్పు టీ స్టాల్లో మోడీ నిర్వహించిన ‘ఛాయ్ పే చర్చా' కార్యక్రమం కూడా గత నెలలో జరిగింది.