సునంద పుష్కర్ మృతిపై పిల్: స్వామి, బ్లాక్ మనీ పై..
భువనేశ్వర్/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేస్తానని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం చెప్పారు.
ఆయన ఒడిశాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో తాను అనేక సందర్భాల్లో కోర్టు జోక్యాన్ని కోరానని, అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయంలోను కోర్టుకు వెళ్లలేదన్నారు.
కాగా, సునంద మృతి వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ, ఆమె మృతిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి ఇంతకుముందు చాలా సందర్భాల్లో డిమాండ్ చేశారు.
ఈ ఏడాది జనవరి 17న సునందా పుష్కర్ దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించిన విషయం తెలిసిందే. సునంద విషం కారణంగా చనిపోయినట్లు ఆమె కడుపులోని అవయవాలను పరీక్షించిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ల బృందం పోలీసులకు గత నెల తాజా నివేదిక ఇచ్చారు.
నల్లధనంపై..
విదేశాల్లో ఉన్న నల్లధనం పైన మాట్లాడుతూ.. బ్లాక్ మనీ అంతా దేశానికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందరు ఊహించిన దానికంటే ముందే బ్లాక్ మనీ దేశానికి తరలి వస్తుందని చెప్పారు.
బీజేపీలో చేరిన కరణ్ సింగ్ తనయుడు
కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్సింగ్ కొడుకు అజాత్ శత్రుసింగ్ ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి ఆధిక్యం సాధించే కృషిలో పాలుపంచుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ అధ్యక్షుడు అమిత్షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రధాన్, జితేంద్రసింగ్ల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.