కోర్టుకి సోనియా, రాహుల్, బెయిల్ అడిగితేవద్దు: స్వామి
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని వచ్చే నెల 7వ తేదీన న్యూఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరవుతారని, వారికి బెయిల్ అడిగినా ఇవ్వవద్దని తాను కోరుతానని బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం అన్నారు.
సోమాజీగుడలోని హోటల్ కత్రియాలో పేట్రియాటిక్ సోషల్ మీడియా ఫౌండేషన్ నెటిజన్లతో బీజేపీ జాతీయ నేత ఛాయాదేవి ఆధ్వర్యంలో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. 2జీ కుంభకోణం తరహాలోనే చిదంబరం, ఆయన తనయుడు జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. దేశమంతా సంస్కృతీ వారోత్సవాలు చేసుకుంటుంటే తమిళనాడు వ్యతిరేకించడం మూర్ఖత్వమన్నారు.
నెటిజన్ల నుండి వచ్చిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా ఇక పైన జాతీయవాదం కోసం పోరాడాలన్నారు. సెప్టెంబర్ 14న అఖిల భారత సోషల్ మీడియా సమావేశం ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో ఆయన సోనియా, రాహుల్ల పైన మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో ఆగస్టు 7న సోనియా, రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, ఈ కేసులో వారికి బెయిల్ రాకుండా పోరాటం చేస్తామన్నారు. వారికి బెయిల్ ఇవ్వాలనుకుంటే ముందుగా పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.