సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో నిందితులను కాపాడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్సిన్హాకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. 2జీ, బొగ్గు కుంభకోణాల కేసుల్లో నిందితులను సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తన నివాసంలో కులసుకున్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని వచ్చిన ఆరోపణలపై.... ఆ సమాచారం ఇచ్చిన విజిల్ బ్లోయర్ పేరు తెలుసుకోకుండానే విచారించడానికి సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది.
2జీ కేసుల విచారణకు నియమితుడైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) ఆనంద్గ్రోవర్ సహకారం అందించాల్సిందిగా కోరింది. వందల కోట్ల విలువజేసే 2జీ స్కాం విషయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినా దాని ప్రభావం బహుముఖంగా ఉంటుందని జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. విజిల్బ్లోయర్ పేరును సీల్డ్ కవర్లో ఉంచి తమకు అందించాలన్న ధర్మాసనం గత ఉత్తర్వులను వెనుక్కు తీసుకోవాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఎన్జీవో తరఫున భూషణ్ కోరారు.
2జీ కేసుల దర్యాప్తులో తాను ఏరకంగానూ జోక్యం చేసుకోవడం లేదని, తనపై కేసును ఒక్కరోజు కొనసాగించినా.. దానివల్ల భారీగా ప్రజానష్టం జరిగి.. 2జీ కేసుల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిన్హా కోర్టుకు చెప్పారు. అయితే ఆయన వాదనను తాము విశ్వసించడం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. రంజిత్ సిన్హా నివాసంలో సందర్శకుల పేర్ల నమోదు పుస్తకాన్ని, సీబీఐ దస్త్రాలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) ఆనంద్గ్రోవర్ అందజేయాలని, ఆయన వాటిని పరిశీలించి తమకు సహకరిస్తారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది.