విమాన టాయ్లెట్లో గోల్డ్ బిస్కెట్లు: ప్యాకెట్ కలకలం
మంగళూరు: ఓ విమానం టాయ్లెట్లో బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరు వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో టాయ్లెట్లోని అద్దం వెనకభాగం వెనకభాగం ఉబ్బినట్లు కనిపించింది.
అనుమానం వచ్చిన అధికారులు అద్దాన్ని తొలగించి చూడగా బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. వంద గ్రాముల చొప్పున బరువున్న పది బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 37.73 లక్షలుగా అంచనా వేశారు. ఆ బిస్కెట్లు ఎవరు దాచారో దర్యాప్తు చేస్తున్నారు.
కలకలం రేపిన ప్యాకెట్
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి ఓ ప్రయాణికుడి బ్యాగులో లభించిన ప్యాకెట్ కలకలం రేపింది. తొలుత దీన్ని ద్రవరూపంలోని బాంబుగా అనుమానించారు. కేరళకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి శనివారం రాత్రి 11 గంటల సమయంలో దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రాయానికి వచ్చాడు. తనిఖీల్లో భాగంగా అతని బ్యాగులోని ఒక ప్యాకెట్, బ్యాటరీ, కొన్ని తీగలను విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు.
దీన్ని ద్రవ రూపంలోని బాంబుగా బావించి విమానాశ్రయం పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఖాదర్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి బాంబు నిర్వీర్య బృందం ఇక్కడికొచ్చే వరకు ప్యాకెట్లో ఉన్నది ఏమిటన్నది చెప్పలేమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఖాదర్ను ప్రశ్నిస్తున్నామని, ఈ విషయంలో భయపడాల్సిన పని లేదని పోలీసులు తెలిపారు.