వాళ్లిచ్చేవి తీసుకోండి, ఓటు మాత్రం మాకే: కేజ్రివాల్
అమేథీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ రాజకీయ పార్టీలు ముడుపులు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం తమ పార్టీకే వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీలోని శుక్లా బజార్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రివాల్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నాయని తెలిపారు.
అంతేగాక ‘ఆ రాజకీయ పార్టీలు మీకు నగదు, ముడుపులు ఇస్తాయి. అది మీ నుంచి దోచుకున్న 2జి, సిడబ్ల్యూజి కుంభకోణాలకు సంబంధించిన సొమ్మే. వారిచ్చే చీరలు, బ్లాంకెట్లు, ఏవిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం వారికి వేయకండి. తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయండి' అని అరవింద్ కేజ్రివాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. అరవింద్ కేజ్రివాల్ తమ పార్టీ అమేథీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ తరపున ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ, గాంధీ కుటుంబం మధ్య ఓ ఒప్పందం జరిగిందని అన్నారు. అదేంటంటే తాను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై విచారణ చేయబోనని మోడీకి.. కాంగ్రెస్కు మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆరోపించారు. తనపై బిజెపి ఏ విధంగా ఆరోపణలు చేస్తుందో.. కుమార్ విశ్వాస్పై కాంగ్రెస్ పార్టీ అలాంటి ఆరోపణలే చేస్తోందని అన్నారు. ఆ రెండు పార్టీల మాటలు నమ్మొద్దని కేజ్రివాల్ అన్నారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అమేథీ ఎంపి అభ్యర్థి రాహుల్ గాంధీ తిరిగి ఇక్కడికి రారని, అదేవిధంగా బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ కూడా రారని, ఆమె నృత్య సంగీతాలకే పరిమితమవుతారని కేజ్రివాల్ అన్నారు. కాగా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కారణంగా అరవింద్ కేజ్రివాల్, కుమార్ విశ్వాస్ లతోపాటు మరో 10మందిపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా రోడ్డుపై సమావేశం నిర్వహించిన కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.