రైలు ప్రమాదం: లోకసభలో మంత్రి సదానంద ప్రకటన
న్యూఢిల్లీ/హైదరాబాద్: మెదక్ జిల్లా రైలు ప్రమాదం పైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ గురువారం లోకసభలో ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 18 మంది పాఠశాల విద్యార్థులు మృతి చెందినట్లు ప్రకటించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించారు.
రైలు ప్రమాద ఘటన దురరదృష్టకరమన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.1 లక్ష రూపాయలు, కొద్దిగా గాయపడ్డ వారికి రూ.20వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటన మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారన్నారు.
అయితే, రెండు లక్షల రూపాయలు ఇవ్వడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ఎంపీ జితేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు ఇవ్వగా.. కేంద్రం కేవలం రెండు లక్షలు ఇవ్వడం శోచనీయమన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక నివేదికలో తేలిందని సదానంద గౌడ చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకే తాము ప్రకటన చేశామన్నారు.
పరిహారం పైన విపక్షాల వ్యాఖ్యల పైన సదానంద గౌడ స్పందిస్తూ... ఇది కేవలం ప్రస్తుత ఎక్స్గ్రేషియా మాత్రమేనని, పూర్తి నష్టపరిహారం కాదన్నారు. నష్టపరిహారాన్ని రైల్వే శాఖ అధికారులు పరిశీలిస్తారని చెప్పారు.
సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి
మెదక్ జిల్లా రైలు ప్రమాదం పైన సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులు మృతి చెందడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు. ప్రమాదాలు చోటుచేసుకోకుండా రైల్వే శాఖ తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు, బస్సు ప్రమాద స్థలాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు సందర్శించారు. టీడీపీ బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ - నిజామాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. హైదరాబాద్ - తాండూరు రద్దయింది. నాందేడ్ - కాచిగూడ రైలు పాక్షికంగా రద్దయింది.
కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
ప్రమాదం పైన కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. మృతులు, క్షతగాత్రుల పైన అధికారులు పూర్తి వివరాలు ఇచ్చారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు.