థాంక్యూ అమెరికా: ప్రధాని మోడీ, ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ: ఐదు రోజుల అమెరికా పర్యటనలో అనుకున్న దానికంటే ఎక్కువే సాధించాను. సంతృప్తిగా భారత్కు తిరిగివెళుతున్నానని ప్రధాని మోడీ తెలిపారు. తన అధికారిక పర్యటనలో చివరిదైన వాషింగ్టన్లోని యుఎస్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్లో మంగళవారం ప్రధాని మోడీ "థ్యాంక్యూ అమెరికా! అనుకున్న దాని కంటే ఎక్కువే సాధించాను. సంతృప్తిగానే భారత్కు తిరిగి వెళుతున్నాను" అన్నారు.
"అమెరికాలో నా పర్యటన విజయవంతమైంది, ఇక్కడ నుండి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళిపోతున్నాను" అని ప్రధాని మోడీ అన్నారు. ఇరు దేశాధినేతలు పలు అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, భారత్లో పెట్టుబడులు పెట్టే దిశగా అమెరికా పారిశ్రామిక దిగ్గజాలను ఒప్పించాలన్న లక్ష్యంతో అమెరికాలో అడుగుపెట్టిన మోడీ, అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలనే సాధించారు.
మోడీ అమెరికా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పారిశ్రామిక దిగ్గజాలతో మోడీ నిర్వహించిన సమావేశం మంచి ఫలితాలను ఇచ్చిందని కూడా వారు చెబుతున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' నినాదం అమెరికా పారిశ్రామికవేత్తలను బాగా ఆకట్టుకుందని, భవిష్యత్తులో భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వారు అంగీకరించారని మోడీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఐదు రోజుల అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం స్వదేశం బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరిన మోడీకి వాషింగ్టన్ డీసీలోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అమెరికా అధికారులు, అక్కడి ప్రవాస భారతీయులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐదు రోజుల అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోడీ, బుధవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.