కూలిన ఆర్మీ హెలికాప్టర్: ముగ్గురి మృతి(ఫొటో)
బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలిలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనిక అధికారులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
ఉదయం 7.45గంటలకు ఆర్మీ ఏవియేషన్ క్యాంపు నుంచి బయల్దేరిన చీతా హెలికాప్టర్ కాసేపటికి కుప్పకూలిపోయింది. ఘటనలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలెట్ల తోపాటు ఓ ఇంజినీర్ మృతి చెందారు.
టెస్టింగ్ కోసం ఆ హెలికాప్టర్ను నడిపినట్లు తెలుస్తోంది. అయితే పైకి ఎగిరిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కుప్పకూలిపోయింది. ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కాగా, 40ఏళ్ల నుంచి సేవలందిస్తున్న చీతా హెలికాప్టర్ను మార్చాలని సైన్యం ఎప్పట్నుంచో చెబుతున్నప్పటికీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. అవినీతి, కుంభకోణాలు, అధికారుల అలసత్వం కారణంగా ఆ హెలికాప్టర్ ముగ్గురి ప్రాణాలను బలిగొంది.