ముగ్గురు వ్యాపారులు కారులో మృతి, విషప్రయోగం?
న్యూఢిల్లీ: ముగ్గురు వ్యాపారులు ఢిల్లీలో ఓ లగ్జరీ కారులో మరణించి కనిపించారు. వారి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురంలో వారి మృతదేహాలతో కారు కనిపించింది.
మృతులను నిషాంత్, బల్వీందర్, లక్ష్మణ్లుగా గుర్తించారు. వారంతా మిత్రులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారం చేస్తుంటారు. తెల్ల రంగు హోండా సిటీ కారులో వారి మృతదేహాలు కనిపించాయి. ఆ కారు బల్వీందర్ది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో వారు మరణించి ఉండడాన్ని గుర్తించారు.
విషం తీసుకోవడం వల్ల గానీ, కారులో చాటింగ్ చేస్తున్నప్పుడు విషపూరితమైన గ్యాస్ విడుదల కావడం వల్ల గానీ వారు మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎసి పెట్టుకుని కారులో వారు చాటింగ్ చేస్తున్నట్లు, అదే సమయంలో స్నాక్స్ ఆరగిస్తున్నట్లు తమకు తెలిసిందని పోలీసులు అంటున్నారు.
వారి శరీరాలపై ఏ విధమైన గాయాలు లేకపోవడంతో విషపూరితమైనవి ఆరగించడం వల్ల గానీ విషపూరితమైన గ్యాస్ వల్ల గానీ మరణించి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. వారికి ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సమీప ప్రాంతాల్లోని సిసిటివి ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
కారులో వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు. కుట్ర జరిగి ఉంటుందని మృతుల తల్లిదండ్రులు ఆరోపించారు. వారికి విషంతో కూడిన పదార్థాలు ఇచ్చి ఉంటారని వారంటున్నారు.